న్యూఢిల్లీ, జూన్ 6: న్యూస్ పేపర్లపై కేంద్రం వివక్ష చూపిస్తోందని.. జర్నలిస్టులపై దాడులు పెరిగాయని ఆల్ ఇండియా న్యూస్ పేపర్ల ఎడిటర్ల సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఏఐఎన్ఈసీ వార్షిక సమావేశం శనివారం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఎడిటర్లు మాట్లాడుతూ.. దినపత్రికల భావప్రకటన స్వేచ్ఛపై కేంద్రం తీవ్ర ఆంక్షలు పెడుతున్నదని, పత్రికల ఆర్థిక పరిస్థితులను ప్రమాదంలోకి నెడుతున్నదని మండిపడ్డారు.
కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాల అడ్వర్టయిజ్మెంట్ పాలసీల వల్ల పెద్ద పత్రికలకు లాభం జరుగుతున్నది కానీ.. చిన్నపత్రికలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదన్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ చిన్న పత్రికలను కూడా గుర్తించాలని జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాలను కోరారు. అలాగే ప్రకటనల పాలసీలలో మార్పులు చేసి చిన్న పత్రికలు నిలబడేలా చూడాలన్నారు.