హైదరాబాద్ : యూపీ ప్రజలు బీజేపీకి అధికారం అప్పగించాలని నిర్ణయించుకున్నారని, వారి నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల లోటుపాట్లు లేవనెత్తుతూ ఓటమిని దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తాయని ఇది ఈవీఎంల తప్పిదం కాదని, ప్రజల మనస్సుల్లో నాటుకున్న చిప్దేనని ఓవైసీ వ్యాఖ్యానించారు. బీజేపీ విజయం సాధించిందని అయితే ఇది 80-20 విజయమని అన్నారు.
లఖింపూర్ ఖేరిలో కూడా బీజేపీ విజయం సాధించడంతోనే తాను 80-20 పర్సెంట్ విజయంగా వ్యాఖ్యానిస్తున్నానని అన్నారు. ఈ సంస్క్రతి మరికొన్నేండ్లు కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు దీన్ని గుర్తెరగాలని చెప్పారు. రేపటి నుంచి తాము క్షేత్రస్ధాయిలో పనిచేస్తామని వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబడతామని అన్నారు. యూపీలో మైనారిటీలను కేవలం ఓటు బ్యాంక్గానే వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ గురించి తాను మాట్లాడి ఆ పార్టీని ఎందుకు గౌరవించాలని ఓవైసీ ప్రశ్నించారు. ఇక బహుజన్ సమాజ్ పార్టీ ఉనికి కీలకమని, ఆ పార్టీ మళ్లీ బలోపేతం కావాలని ఆకాంక్షించారు. దేశానికి బీఎస్పీ అవసరమని అన్నారు. భారత ప్రజాస్వామ్యంలో ఆ పార్టీకి ప్రముఖ పాత్ర ఉందని స్పష్టం చేశారు. ఇక ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ఎంఐఎం నేతలు, కార్యకర్తలు, తమ పార్టీకి ఓటువేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్ధానాలకు గాను బీజేపీ 271 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా ఎస్పీ 127 స్ధానాల్లో, బీఎస్పీ 1, కాంగ్రెస్ 2, ఇతరులు 2 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు.