న్యూఢిల్లీ : లోక్సభ సెక్రటేరియట్ కొన్ని పదాలను అన్పార్లమెంటరీగా పేర్కొంటూ బుక్లెట్ విడుదల చేయడం, జాతీయ చిహ్నం వంటి అంశాలపై మోదీ సర్కార్ లక్ష్యంగా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. పార్లమెంట్లో ఏ సందర్భంలో ఎలాంటి పదాలు వాడారనేది కీలకమని, కేవలం ఆయా పదాలను అన్పార్లమెంటరీగా వర్గీకరించలేరని అసదుద్దీన్ అన్నారు.
ప్రధాని వెనుక స్పీకర్ కూర్చోవడం అన్పార్లమెంటరీ కాదా అని జాతీయ చిహ్నం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ ఓవైసీ ప్రశ్నించారు. జుమ్లాజీవి, కొవడ్ స్ప్రెడర్, సిగ్గుచేటు, బూటకం వంటి పదాలను అన్పార్లమెంటరీగా పేర్కొంటూ లోక్సభ సెక్రటేరియట్ బుక్లెట్ జారీ చేయడంపై హాట్ డిబేట్ సాగుతున్న క్రమంలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అంతకుముందు ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాలనను సరైన రీతిలో ఎండగడుతూ చేసే వ్యాఖ్యలు ఇప్పుడు అన్పార్లమెంటరీ పదాలుగా మారాయని, వీటిని మాట్లాడకుండా నిషేధించారని రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్కు రాహుల్ గాంధీ న్యూ డిక్షనరీ ఫర్ న్యూ ఇండియా అనే క్యాప్షన్ ఇచ్చారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ కూడా లోక్సభ సెక్రటేరియట్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ పదాలను తాను వాడతానని, దమ్ముంటే స్పీకర్ తనను సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు.