న్యూఢిల్లీ, డిసెంబర్ 6: మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లపై పరిమితిని ఎత్తివేస్తున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రకటించింది. నాణ్యతా ప్రమాణాల్ని పెంచే ఉద్దేశంతో బీబీఏ, బీసీఏ కోర్సుల్ని ఏఐసీటీఈ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఏఐసీటీఈ చైర్మన్ టీజీ సీతారామ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2024-27కు సంబంధించి అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్బుక్ (ఏపీహెచ్)ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఇంజినీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ 3 ఏండ్లకోసారి సీట్ల పరిమితిపై అనుమతులు ఇస్తుంది. కౌన్సిల్ నిబంధనలు వర్తిస్తాయి. నిపుణుల కమిటీ సందర్శించి ఆమోదం తెలపాలి. మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్ యూజీ కోర్సులను క్రమబద్ధీకరిస్తూ ఏఐసీటీఈ పరిధిలోకి తీసుకొస్తున్నాం’ అని అన్నారు. బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులను ఆఫర్ చేస్తున్న కాలేజీలు ఇక నుంచి ఏఐసీటీఈ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. యూజీ కోర్సుల విద్య, పాలనాపరమైన విధానాల్లో మార్పులు చేయలేదన్నారు.
‘సాంకేతిక, మేనేజ్మెంట్ విద్యలో సమన్వయంతో కూడిన అభివృద్ధిని ప్రతిపాదిస్తూ బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులను కౌన్సిల్ పరిధిలోకి తీసుకొస్తున్నాం’ అని ఏఐసీటీఈ మెంబర్ సెక్రటరీ రాజీవ్కుమార్ చెప్పారు. నూతన ఏపీహెచ్ ప్రకారం, పాలిటెక్నిక్ కాలేజీలు అటానమీ హోదా కోసం దరఖాస్తు చేయాలి. దీంతో సొంత పాఠ్యప్రణాళికతో కొత్త కోర్సులను తీసుకురావొచ్చు. సీట్ల సంఖ్య పెంపునకు ఏఐసీటీఈ అనుమతులు అవసరం.