PM Modi : దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (AI Impact Summit- 2026)’ ను నిర్వహిస్తుండటంపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) హర్షం వ్యక్తంచేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలకు భారత యువత ప్రతిభ, సామర్థ్యం తెలుస్తాయని అన్నారు. ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ముందడుగు వేస్తోందని చెప్పారు.
సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ వేగంగా వృద్ధి చెందుతుందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనమని ప్రధాని అన్నారు. గ్లోబల్ సౌత్లో నిర్వహిస్తున్న ఈ మొదటి ప్రధాన అంతర్జాతీయ ఏఐ (AI) సమ్మిట్ మన దేశంలో జరుగుతుండటం గర్వకారణమని చెప్పారు. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ (అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందం)’ అనే ఈ సదస్సు థీమ్పై మోదీ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల పురోగతి కోసం కృత్రిమ మేథస్సును ఉపయోగించుకోవడంలో మన ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు.
ఈ ఏఐ సమ్మిట్వల్ల డిజిటల్ సదుపాయాల కల్పన, శక్తిమంతమైన స్టార్టప్ల ఏర్పాటు, అత్యాధునిక పరిశోధనలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భారత్ బాధ్యత మరింత పెరగనుందని ప్రధాని చెప్పారు. ఇప్పటికే ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పాలన లాంటి అనేక రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తున్నదని అన్నారు. ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న ఈ సదస్సుకు 45కు పైగా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. ఆయా దేశాలు తమ ఏఐ అజెండాలను నిర్వచించుకోనున్నాయని చెప్పారు.
మన ప్రతిభను ప్రదర్శించడం, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, విస్తృతమవుతున్న అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేయడం ఈ సదస్సు ఉద్దేశమని ప్రధాని మోదీ వెల్లడించారు.