లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోరుకు ముందు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ దళితుల ఓట్లను ఆకర్షించేందుకు వారణాసిలోని కబీర్ చౌర మఠ్లో మూడురోజుల పాటు మకాం వేయనున్నారు. సంత్ కబీర్ దాస్ తన జీవితమంతా కబీర్ చౌరా మఠ్లో గడిపారు. సంత్ కబీర్దాస్ సామాజిక న్యాయం, సమానత్వ నినాదాలను అందింపుచ్చుకున్న దళిత ఓటర్లను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించేలా ప్రియాంక వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. ఏడున జరిగే ఏడో దశ పోలింగ్ 54 స్ధానాల్లో జరగనుండగా ఈ ప్రాంతంలో అధికంగా బీసీలు, దళితుల ఓట్లున్నాయి.
ఈ వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పలు వరాలు ప్రకటించింది. ప్రియాంక, రాహుల్ శుక్రవారం పింద్రా జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాశీ విశ్వనాధ ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
కాగా, కుల సమీకరణలకు పెట్టింది పేరైన యూపీలో యాదవులు ఇతర ఓబీసీలు, ముస్లిం ఓట్ల మద్దతుతో అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ పావులు కదుపుతుండగా యాదవేతర ఓబీసీలు, బ్రాహ్మణులు ఇతర అగ్రకులాల అండదండలతో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దళితుల వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి సారధ్యంలోని బీఎస్పీ చెమటోడుస్తోంది.