న్యూఢిల్లీ: కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకురాలు తేజస్విని గౌడ (Tejaswini Gowda) కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల కిందట ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆమె తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, మీడియా, ప్రచార విభాగం అధినేత పవన్ ఖేరా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీపై తేజస్విని గౌడ మండిపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై ఆ పార్టీకి నమ్మకం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ మాటల్లో కాకుండా చేతలను నమ్ముతుందని అన్నారు. చరిత్ర ఉన్న కాంగ్రెస్లోకి తిరిగి వచ్చిన తాను పూర్తి చిత్తశుద్ధితో పార్టీ కోసం పని చేస్తానని అన్నారు.
కాగా, మాజీ జర్నలిస్ట్ అయిన తేజస్విని గౌడ 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. బెంగళూరు రూరల్ స్థానం నుంచి మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడపై ఆమె గెలిచారు. అయితే 2014లో కాంగ్రెస్ పార్టీని వీడిన తేజస్విని గౌడ బీజేపీలో చేరారు. 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ ఏడాది జూన్తో ఎమ్మెల్సీ పదవి ముగియనుండగా గత నెలలో శాసన మండలి సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. శనివారం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.