న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన క్రమంలో రైతులు ఆందోళన విరమించి, ఇండ్లకు తిరిగివెళ్లాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శనివారం అన్నదాతలకు విజ్ఞప్తి చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కితీసుకున్నందున ఆందోళన కొనసాగించాల్సిన అవసరం లేదని, రైతులు నిరసనలను వీడి ఇండ్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
రైతుల డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. పంటల వైవిధ్యం, జీరో బడ్జెట్ ఫార్మింగ్, మద్దతు ధర యంత్రాంగాన్ని పటిష్టం చేయడం వంటి పలు అంశాలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఈ కమిటీల్లో ఉంటారని చెప్పారు.
రైతులు పంట వ్యర్ధాలను దగ్ధం చేయడాన్ని నేరపూరిత చర్యగా చూడరాదన్న రైతు సంఘాల డిమాండ్ను కూడా ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటుతో ఎంఎస్పీపై రైతుల డిమాండ్ కూడా నెరవేరినట్టేనని మంత్రి తెలిపారు.