న్యూఢిల్లీ: భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదలో వ్యవసాయం అంతర్భాగమని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ అన్నారు. మూడు రోజుల టూర్లో భాగంగా ఆయన కేరళలోని తన సొంత నియోజకవర్గం వాయనాడ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తిరువంబాడిలో మాట్లాడిన ఆయన.. రైతులపైనా, రైతుల్లోని నవకల్పనలు చేసే సామర్థ్యంపైనా తనకు అపారమైన నమ్మకం ఉన్నదని రాహుల్ చెప్పారు.
పంటలు పండించాలంటే తగిన పరిజ్ఞానం, ఉత్సాహం, పట్టుదల అవసరమని, రైతులలో అవి మెండుగా ఉంటాయని రాహుల్గాంధీ పేర్కొన్నారు. దేశం కోసం రైతులు ఎంతో ఇచ్చారన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, నూతన వ్యవసాయ చట్టాలు దేశ ఆర్థి వ్యవస్థలోని ఇన్ఫార్మల్ స్ట్రక్చర్ను బలహనం చేశాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వ మతిలేని చర్యల పరిణమాలు భవిష్యత్తులో భారతదేశం తన పౌరులకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేని స్థితికి తీసుకెళ్తాయని వ్యాఖ్యానించారు.