న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు అగ్నిపథ్కు వ్యతిరేకంగా సోమవారం దేశవ్యాప్తంగా బంద్ జరిగింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మరింత అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా సోమవారం ఏకంగా 595కు పైగా రైళ్లను రద్దు చేసింది. రద్దైన వాటిలో 208 ఎక్స్ప్రెస్, 379 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. మరో నాలుగు ఎక్స్ప్రెస్, 6 ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది.
త్రివిధ దళాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా బుధవారం మొదలైన ఆందోళనలు శుక్రవారం దేశవ్యాప్తంగా వ్యాపించాయి. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఒడిశా,హిమాచల్ తదితర 12 రాష్ర్టాల్లో దాదాపు 70 చోట్ల నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఆందోళనకారులు రైల్వేస్టేషన్లను ముట్టడించి 12 రైళ్లను తగులబెట్టారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో శుక్రవారం ఓ నిరసనకారుడు మరణించాడు.
మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా రైల్వేశాఖ శుక్రవారం 235 రైళ్లను రద్దు చేసింది. అలాగే శనివారం, ఆదివారం కూడా వందల సంఖ్యలో రైళ్ల రద్దు కొనసాగింది. సోమవారం నాటికి రద్దైన రైళ్ల సంఖ్య ఏకంగా 600కు చేరింది. నిరసనల నేపథ్యంలో పలు రైళ్లు చాలా చోట్ల ఆగిపోయాయి. దీంతో రైల్వే ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.