అహ్మదాబాద్, ఏప్రిల్ 28: మూడోసారి అధికారాన్ని నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ గుజరాత్పై గంపెడాశలు పెట్టుకున్నది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ మంచి ఫలితాలు సాధించవచ్చని బీజేపీ నమ్మకంగా ఉన్నది. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 26 స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకొని క్లీన్స్వీప్ చేసింది. ఈసారి కూడా ఇవే ఫలితాలను రిపీట్ చేయాలనుకుంటున్న వేళ క్షత్రియుల రూపంలో బీజేపీకి ఊహించని ప్రతికూలత మొదలయ్యింది.
బీజేపీకి వ్యతిరేకంగా రాజ్పుత్ల ఆందోళనలు
బీజేపీకి క్షత్రియులు బలమైన ఓటుబ్యాంకుగా ఉన్నారు. క్షత్రియుల్లో రాజ్పుత్లతో పాటు కొన్ని ఓబీసీ సామాజికవర్గాలు ఉన్నాయి. వీరందరూ బీజేపీ వైపే నిలుస్తూ వచ్చారు. అయితే, మార్చి 22న దళితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్పుత్లపై కేంద్రమంత్రి, రాజ్కోట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురుషోత్తం రూపాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాజ్పుత్లు భగ్గుమన్నారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వొ ద్దంటూ నినదించారు. 109 క్షత్రియ సంఘాలు ఒక్కటయ్యాయి. క్షత్రియుల్లో వ్యతిరేకత గుర్తించిన రూపాలా సహా బీజేపీ నేతలు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అయినా వీరిలో అసంతృప్తి కొనసాగుతున్నది.
గిరిజనులను ఆకర్షిస్తున్న కాంగ్రెస్: ఆప్
కాంగ్రెస్ – ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా గిరిజన ఓటుబ్యాంకును ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్రంలో దాహోద్, ఛోటా ఉదయ్పూర్, బర్దోలి, వల్సద్ స్థానాలు ఎస్టీలకు రిజర్వయ్యాయి. భరూచ్లోనూ గిరిజనుల జనాభా ఎక్కువ. ప్రధానంగా ఈ సీట్లపై కూటమి కన్నేసింది. రాహుల్ గాంధీ కూడా తన భారత్ జోడో న్యాయ్ యాత్రను ఈ స్థానాల్లోనే కొనసాగించారు.
బీజేపీకి అంత సులువు కాదా?
2014, 2019 ఎన్నికల్లో గుజరాత్లోని మొత్తం 26 నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. అయితే, ఈసారి మాత్రం వారికి విజయం నల్లేరు మీద నడక కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది గుర్తించిన బీజేపీ 14 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టింది. కాగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు, మైనారిటీల ఓట్లు కాంగ్రెస్ – ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది.