Lockdown Effect | న్యూఢిల్లీ, జూన్ 12: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించిన తర్వాత మనిషి ప్రవర్తనలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కఠిన లాక్డౌన్లు ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. అయితే, ఇది ఒక్క మానవులకు మాత్రమే పరిమితం కాలేదు. వన్యప్రాణుల ప్రవర్తనలోనూ లాక్డౌన్ మార్పులు తెచ్చినట్టు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. లాక్డౌన్ కారణంగా 2020, 2021లో ప్రజలు ఇండ్లకే పరిమితం కాగా, జంతువులు మాత్రం మామూలుకంటే చాలా దూరం ప్రయాణించినట్టు గుర్తించారు. 174 మందితో శాస్త్రవేత్తలు జరిపిన ఈ పరిశోధన వివరాలు సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. మొత్తం 43 వేర్వేరు జాతులకు చెందిన 2300 మంది క్షీరదాలపై ఈ అధ్యయనం జరిగింది. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా వాటి కదలికల డాటాను సేకరించారు. లాక్డౌన్ కారణంగా పరిసరాలు ప్రశాంతంగా ఉండడంతో పులులు, సింహాలు వంటి క్రూరమృగాలు రోడ్లపైకి వచ్చి యథేచ్ఛగా సంచరించాయి.
లాక్డౌన్ లేని సమయంతో పోలిస్తే లాక్డౌన్ అమల్లో ఉన్న 10 రోజుల్లో జంతువులు 73 శాతం అధిక దూరం ప్రయాణించినట్టు గుర్తించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అటవీ జంతువులు సమీపంలోని రోడ్లకు సగటున 36 శాతం దగ్గరగా వచ్చాయి. లాక్డౌన్ అంతగా అమలులో లేని ప్రాంతాల్లో మాత్రం తక్కువ దూరం ప్రయాణించాయి. అంతేకాదు, కరోనా తర్వాత ప్రజలు ప్రకృతికి దగ్గరగా వెళ్లేందుకు ఇష్టపడ్డారని, ఫలితంగా కొవిడ్-19 ముందుతో పోలిస్తే ప్రకృతి ప్రదేశాలు కొంత రద్దీగా మారినట్టు అధ్యయన రూపకర్త థామస్ మ్యుల్లెర్ తెలిపారు. మనుషుల కదలికలు పరిమితంగా ఉన్నప్పుడు జంతువులు వృద్ధి చెందుతాయని అధ్యయనం అంతిమంగా తేల్చింది. మనం కనుక కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే అది జంతువులపై సానుకూల ప్రభావం చూపిస్తుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన మార్లీ ఎ టక్కర్తెలిపారు.