Nitin Gadkari | ఛత్రపతి శివాజీ మహారాజ్పై మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియారీ వ్యాఖ్యలు.. ఆ రాష్ట్రంలోని అధికార శివసేన ఏక్నాథ్ షిండే వర్గం-బీజేపీ కూటమిలో ప్రకంపనలు రేపుతున్నాయి. బీజేపీని, సీఎం ఏక్నాథ్ షిండేను లక్ష్యంగా చేసుకుని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మౌనం వీడారు. మిత్రపక్ష నేత, సీఎం ఏక్నాథ్ షిండే తీరును గడ్కరీ సోమవారం తప్పుబట్టారు. `శివాజీ మహారాజ్ మాకు దేవుడు. మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయన్ను పూజిస్తాం` అని గడ్కరీ వ్యాఖ్యానించారు.
శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ భగత్సింగ్ కోషియారీ మాట్లాడుతూ మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ కాలం చెల్లిన ప్రముఖుడు అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. `మీ ఆరాధ్య నాయకులు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మాగాంధీ అని జవాబులు వస్తాయి. మహారాష్ట్రలో చాలా మంది ఆరాధ్య నాయకులు ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాతకాలం నాటి ఆరాధ్య దైవం. ఇప్పుడు బీఆర్ అంబేద్కర్, నితిన్ గడ్కరీ` అని అన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్లకు గౌరవ డాక్టరేట్ ప్రదానం సందర్భంగా కోషియారీ ఈ వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ భగత్సింగ్ కోషియారీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర మంత్రి గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి, సీఎం ఏక్నాథ్ షిండే శివసేన వర్గంతో కూడిన అధికార కూటమికి ఇబ్బందికరంగా మారాయి. కోషియారీ వ్యాఖ్యలపై ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని శివసేన వర్గం, ఎన్సీపీ మండిపడ్డాయి. బీజేపీ నేతతో సమానంగా శివాజీ మహారాజ్ను సరిపోలుస్తూ మహారాష్ట్ర గొప్పతనాన్ని గవర్నర్ కించపరుస్తున్నారని ఆరోపించాయి.
గవర్నర్ వ్యాఖ్యలపై సీఎం ఏక్నాథ్ షిండే మౌనంగా వ్యవహరించడాన్ని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రశ్నించింది. గవర్నర్ కోషియారీని మహారాష్ట్ర నుంచి సాగనంపాలని సోమవారం అధికార శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ డిమాండ్ చేయడం గమనార్హం.