న్యూఢిల్లీ: స్పైస్జెట్ విమానం క్యాబిన్లో పొగలు వ్యాపించిన సంఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పందించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ సంస్థపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆపరేషన్లో ఉన్న అన్ని క్యూ400 విమాన ఇంజిన్లను వారంలోపు తనిఖీ చేయాలని సోమవారం ఆదేశించింది. ఈ నెల 12న గోవా నుంచి హైదరాబాద్కు ప్రయాణించిన స్పైస్జెట్ విమానం క్యాబిన్లో పొగలు వ్యాపించాయి. దీంతో రాత్రి వేళ 11 గంటలకు ఆ విమానాన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులోని ప్రయాణికులు అత్యవసర మార్గం ద్వారా బయటపడ్డారు. ఈ సందర్భంగా ఒక ప్రయాణికుడు స్వల్పంగా గాయపడ్డాడు.
కాగా, ఈ సంఘటనపై దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశించింది. స్పైస్జెట్ విమానం ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్లోకి ఇంజిన్ ఆయిల్ ప్రవేశించడం వల్ల క్యాబిన్లో పొగలు వచ్చినట్లు పరిశీలనతో తేలింది. ఈ నేపథ్యంలో విమాన ఇంధనంలో మెటల్ లేదా కార్బన్ సీల్ భాగాలు లేవని నిర్ధారించడానికి ఇంజిన్ తయారీ సంస్థ అయిన కెనడాలోని ప్రాట్ అండ్ విట్నీకి ఇంధనం నమూనాలను ప్రతి 15 రోజులకొకసారి పంపాలని ఆదేశించింది. అలాగే లోహ కణాల ఉనికిని గుర్తించేందుకు అన్ని క్యూ400 విమానాల్లో మాగ్నెటిక్ చిప్ డిటెక్టర్లను తనిఖీ చేయాలని స్పైస్జెట్కు సూచించింది.