Karnataka | బెంగళూరు, జూలై 6: కర్ణాటకను ‘బదిలీల’ అవినీతి(వ్యాపారం) కుదిపేస్తున్నది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో అవినీతికి పాల్పడుతున్నదని, రాజకీయ అవసరాల కోసం ఉద్యోగులను బలి తీసుకుంటున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం అసెంబ్లీ జీరో అవర్లో ఈ విషయాన్ని మాజీ సీఎం బొమ్మై ప్రస్తావించారు. జేడీ(ఎస్) నాయకుడు కుమారస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను సర్కారు వేధిస్తున్నదని, వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నదని లేదా బదిలీ చేస్తున్నదని విమర్శించారు. ‘బదిలీల వ్యాపారం’పై తన వద్ద సాక్ష్యాధారాలున్నాయని బుధవారం మీడియా సమావేశంలో ఆయన ఒక పెన్ డ్రైవ్ను ప్రదర్శించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. కండక్టర్ జగదీశ్ భార్య పంచాయతీ సభ్యురాలని, దీని వల్ల అనవసరంగా జగదీశ్పై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. గతంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసిన జార్జ్, ఈశ్వరప్పల మాదిరి చలువరాయస్వామి కూడా బాధ్యతల నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు.
కండక్టర్ పరిస్థితి విషమం
కారణం చెప్పకుండా తనను వేరే తాలుకాకు బదిలీ చేశారని ఆరోపిస్తూ గురువారం కేఎస్ఆర్టీసీ నగమంగళ బస్ డిపోలో జగదీశ్ అనే కేఎస్ఆర్టీసీ కండక్టర్ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన బదిలీకి మండ్య జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయ స్వామే కారణమని సూసైడ్ నోట్ రాశాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బెంగళూరుకు తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కాకపోవడం గమనార్హం.