గువాహటి: బీజేపీ పాలిత మణిపూర్లో హింస (Manipur Violence) ఇంకా తగ్గలేదు. మెయిటీ, కుకీ వర్గాల మధ్య పోరాటం ఇంకా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఒక బాలుడ్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఎనిమిదేళ్ల బాలుడు, అతడి తల్లి, బంధువైన వ్యక్తి సజీవ దహనమయ్యారు. పశ్చిమ ఇంఫాల్లోని ఇరోయిసెంబా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అస్సాం రైఫిల్స్ భద్రతగా ఉన్న శిబిరంపై ఆదివారం సాయంత్రం దాడి జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో 8 ఏళ్ల బాలుడి తలకు బుల్లెట్ గాయమైంది. దీంతో ఇంఫాల్లోని పోలీసులతో అస్సాం రైఫిల్స్ ఆఫీసర్ ఫోన్లో మాట్లాడారు. ఇంఫాల్లోని రిమ్స్కు ఆ బాలుడ్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
కాగా, తలకు బుల్లెట్ గాయమైన 8 ఏళ్ల బాలుడ్ని అంబులెన్స్లో ఇంఫాల్ తరలించేందుకు ప్రయత్నించారు. ఆ బాలుడి తల్లి, బంధువైన వ్యక్తి అందులో ప్రయాణించారు. కొంత దూరం వరకు అస్సాం రైఫిల్స్ సిబ్బంది అంబులెన్స్కు ఎస్కార్ట్గా ఉన్నారు. ఆ తర్వాత ఆ బాధ్యతను స్థానిక పోలీసులు తీసుకున్నారు.
మరోవైపు ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కుకీ గ్రామాలున్న ఇరోయిసెంబా ప్రాంతానికి ఆ అంబులెన్స్ చేరగా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. తలకు బుల్లెట్ గాయమైన బాలుడు, అతడి తల్లితోపాటు బంధువైన మరో వ్యక్తి సజీవ దహనమయ్యారు. మృతులను 8 ఏళ్ల టోన్సింగ్ హాంగ్సింగ్, అతడి తల్లి మీనా హాంగ్సింగ్, బంధువు లిడియా లౌరెంబమ్గా గుర్తించారు. కాగా, మే 27 నుంచి రెండు వర్గాల మధ్య మరోసారి చెలరేగిన ఘర్షణలో సుమారు 80 మంది మరణించగా, 35,000 మంది జనం నిరాశ్రులయ్యారు.