కోల్కతా, జూన్ 29: ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చి అక్రమంగా గద్దెనెక్కడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఆ పార్టీ కీలక నేత సువేందు అధికారి తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం విపక్షాలు అధికారంలో ఉన్న జార్ఖండ్, రాజస్థాన్లో కూడా త్వరలో రాబోతున్నదని ఆయన అన్నారు. పశ్చిమబెంగాల్లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా సంక్షోభంలో పడనున్నట్టు జోస్యం చెప్పారు. ఐదేండ్లు పూర్తికాకుండానే తృణమూల్ సర్కారు కూలిపోవడం ఖాయమన్నారు.
9 రోజుల్లో ఏం జరిగిందంటే..
జూన్ 21: 21 మంది ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ సర్కారుపై షిండే తిరుగుబావుటా.. సూరత్లోమకాం.. అటు నుంచి గువాహటికి..
జూన్ 22: రెబల్స్ను ఉద్దేశిస్తూ ఉద్ధవ్ భావోద్వేగ ప్రసంగం.. బీజేపీకి లొంగబోనని వెల్లడి.. అధికారిక నివాసం ఖాళీ
జూన్ 23: కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమేనన్న శివసేన.. 24 గంటల్లోగా ముంబైకి రావాలని రెబల్స్కు డెడ్లైన్.. తిరుగుబాటు నేతలు రాకపోవడంతో 12 మందిపై అనర్హత వేటుకు సిఫార్సు
జూన్ 24: బీజేపీ వెన్నుపోటు పొడిచిందని, ఆ పార్టీతో పొత్తు ఉండబోదన్న ఉద్ధవ్
జూన్ 25: రెబల్స్పై మహారాష్ట్ర వ్యాప్తంగా శివసైనికుల నిరసనలు.. షిండే శిబిరంలో 50కు చేరిన ఎమ్మెల్యేలు.. తమను బలవంతంగా తరలించారంటూ ఒకరిద్దరు శివసేన ఎమ్మెల్యేల వెనక్కి
జూన్ 26: 15 మంది రెబల్స్కి డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు.. సుప్రీంకు షిండే వర్గం.. అసమ్మతి ఎమ్మెల్యేల సతీమణులతో ఉద్ధవ్ భార్య రష్మీ ఠాక్రే మంతనాలు, బుజ్జగింపులకు యత్నాలు
జూన్ 27: 15 మంది ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసులపై సుప్రీం స్టే.. అసమ్మతి ఎమ్మెల్యేల నుంచి మంత్రిత్వ శాఖలను ఉపసంహరించిన ఉద్ధవ్
జూన్ 28: విశ్వాస పరీక్షకు ఆదేశించాలని గవర్నర్కు ఫడ్నవీస్ లేఖ.. ముంబైకి వచ్చి తనతో చర్చించాలని రెబల్స్కు ఉద్ధవ్ మరోసారి పిలుపు
జూన్ 29: 30న బలపరీక్షకు గవర్నర్ ఆదేశం.. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంలో ఉద్ధవ్ వర్గం పిటిషన్.. విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందేనన్న కోర్టు.. సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామా