బెంగళూరు: ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే భారత ప్రధాని నరేంద్రమోదీని విషనాగు అంటే.. ఇప్పుడు ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే ప్రధానిని ఏకంగా ‘పనికిరాని కొడుకు’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ సభలో ప్రియాంక్ ప్రసంగిస్తూ ఇటీవల కలబురగి సభలో ప్రధాని బంజారాలకు ఇచ్చిన బరోసా గురించి ప్రస్తావించారు.
కలబురగి సభలో ప్రధాని మాట్లాడుతూ.. బంజారా సామాజిక వర్గం బాధపడవద్దని, ఢిల్లీ పీఠంపై మీ కొడుకు ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ బంజారాల కొడుకు కాదని, పనికిరాని కొడుకు (నలాయక్ బేటా) అని ప్రియాంక్ ఖర్గే విమర్శించారు. అలాంటి పనికిరాని కొడుకు ఏం చేస్తాడని ప్రశ్నించారు. అలాంటి పనికిరాని కొడుకుతో మన ఇళ్లు ఎలా గడుస్తాయని వ్యాఖ్యానించారు.
కాగా, ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. కాంగ్రెస్ నేతల నోళ్లు మంచివి కావని బీజేపీ నేతలు విమర్శించారు. కర్ణాటక ప్రజలు తమ వెంటే ఉన్నారని.. మల్లిఖార్జున్ ఖర్గే, ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని మండిపడ్డారు.