ముంబై: ప్రభుత్వ స్కూల్లో బిస్కెట్లు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కావడంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏడుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్గా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (students hospitalised) మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం కేకేట్ జల్గావ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార భోజన పథకం కార్యక్రమంలో భాగంగా బిస్కెట్లు ఇచ్చారు. అవి తిన్న తర్వాత వికారం, వాంతులతో విద్యార్థులు అస్వస్థత చెందారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు, ఇతర అధికారులు వెంటనే ఆ పాఠశాలకు చేరుకున్నారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిని గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. బిస్కెట్లు తిన్న తరువాత స్కూల్లోని 257 మంది విద్యార్థుల్లో ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించాయని ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ బాబాసాహెబ్ తెలిపారు. ఉదయం 8.30 గంటలకు 153 మంది బడి పిల్లలను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు చెప్పారు.
మరోవైపు చికిత్స తర్వాత పలువురు విద్యార్థులను వారి ఇళ్లకు పంపేశారు. సుమారు 80 మందికి గ్రామీణ ఆసుపత్రిలో చికిత్స అందించారు. తీవ్ర లక్షణాలున్న ఏడుగురు విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు వైద్యాధికారి తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్ కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.