న్యూఢిల్లీ, డిసెంబర్ 19: నోట్ల రద్దు తర్వాతే నోట్ల చలామణి డబుల్ అయ్యిందని పార్లమెంట్లో కేంద్రం ఒప్పుకొన్నది. ప్రస్తుతం చలామణి అయ్యే నోట్ల విలువ 2016 కంటే రెట్టింపు అని సోమవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో డీఎంకే ఎంపీ వేలుస్వామి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. నోట్ల రద్దు కంటే ముందు 2016 మార్చి 31 నాటికి ప్రజల వద్ద రూ.16.41 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉండగా, 2022 డిసెంబర్ 2 నాటికి అది రూ.31.92 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. అయితే, జీడీపీలో ఎంత శాతం నోట్లు వాడుకలో ఉన్నాయన్న దానిపై కేంద్ర మంత్రి వివరణ ఇవ్వలేదు. అటు.. ప్రజల వద్ద ఉన్న నోట్ల సంఖ్య కూడా 30 శాతం పెరిగిందని వెల్లడించారు. 2016 నాటికి ప్రజల వద్ద 9 వేల కోట్ల నోట్లు ఉండగా, 2017లో 10 వేల కోట్లు, 2018లో 10.2 వేల కోట్లు, 2019లో 10.8 వేల కోట్లు, 2020లో 11.5 వేల కోట్లు, 2021లో 12.4 వేల కోట్లు ఉన్నాయని తెలిపారు. 2022 నాటికి ప్రజల వద్ద ఉన్న నోట్ల సంఖ్య 13 వేల కోట్లకు చేరిందని పేర్కొన్నారు.