న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ పరిస్థితుల అనంతరం తొలిసారిగా గత ఆదివారం ప్రయాణాలు గరిష్ఠ స్థాయికి చేరాయని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. ఆదివారం 3,27,923 మంది ప్రయాణాలు సాగించారన్నారు. గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో నెలల పాటు విమానాలు నడవలేదు. ఆ తర్వాత కేసులు తగ్గినా సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ఎక్కువ మంది విమానాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపలేదు. కానీ, గత ఆదివారం పెద్ద ఎత్తున ఫ్లైట్స్లో ప్రయాణించడంతో విమానయాన రంగం ఊపిరిపీల్చుకున్నది.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ 2,372 విమానాల్లో.. 3,27,923 మంది ప్రయాణించారని చెప్పారు. మహమ్మారికి ముందు, భారత్లో రోజువారీ దేశీయ ప్రయాణికుల సంఖ్య 4.25 లక్షలు. కరోనా కారణంగా కేంద్రం గతేడాది మార్చి 25 నుంచి మే 25 వరకు అన్ని దేశీయ విమానాలను నిలిపివేసింది. ఆ తర్వాత దేశీయ విమానాలను 33 శాతంతో మాత్రమే నడిపేందుకు అనుమతి ఇవ్వగా.. ఈ నెల 18 నుంచి కేంద్రం ఎలాంటి పరిమితి లేకుండా పూర్తిసామర్థ్యంతో సర్వీసులు నడుపుకునేందుకు అనుమతి ఇచ్చింది.