పనాజీ: గోవా-ముంబై వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు (Vande Bharat Train) ప్రారంభం రద్దైంది. శనివారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించాల్సి ఉంది. దీని కోసం మడ్గావ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు జెండా ఊపాల్సి ఉంది. అయితే ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్నాయి. షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్నది. దాని కంపార్ట్మెంట్లు మెయిన్ లైన్పై పడ్డాయి. అయితే కొన్ని నిమిషాల్లోనే మెయిన్ లైన్లో వస్తున్న యశ్వంత్పూర్- హౌరా ఎక్స్ప్రెస్, ఆ పట్టాలపై పడిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ బోగీలను ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య సుమారు 300కు చేరగా, వెయ్యి మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు.
కాగా, ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాద స్థలానికి వెళ్లారు. సహాయక కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం గోవాలోని మడ్గావ్ స్టేషన్ నుంచి ప్రారంభించాల్సిన గోవా- ముంబై వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దైంది. ఒడిశాలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం కారణంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అందుబాటులో లేకపోవడంతో గోవా-ముంబై వందే భారత్ రైలు ప్రారంభం వాయిదా పడింది.