VAT Reduction on Petrol | మూడు లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం గణనీయంగా పడినట్లు కనిపిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా సామాన్యుడికి స్వల్పంగా రిలీఫ్నిస్తూ లీటర్ పెట్రోల్పై రూ.5, లీటర్ డీజిల్పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం తగ్గించిన మరునాడే పలు రాష్ట్ర ప్రభుత్వాలు అదే బాటలో ప్రయాణిస్తున్నాయి. ఎక్సైజ్ సుంకానికి అనుగుణంగా వ్యాట్ పెంచేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు తగ్గించే పనిలో పడ్డాయి. ఆ జాబితాలో కర్ణాటక, అసోం, గుజరాత్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఒడిశా తదితర రాష్ట్రాలు వ్యాట్ తగ్గించివేశాయి.
పెట్రోల్, డీజిల్లపై కేంద్రం ఎక్సైజ్ సుంకంలో కోత విధించడం నా గుండెను తాకింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయానికి అనుగుణంగా తక్షణం రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ మీద రూ.7 వ్యాట్ తగ్గిస్తున్నాం అని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ట్వీట్ చేశారు.
గోవా ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించివేసింది. పెట్రోల్, డీజిల్లపై ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా భారతీయులందరికీ మోదీ ప్రభుత్వం గొప్ప బహుమతి అందించింది. ప్రధాని నరేంద్రమోదీకి ధన్యాదాలు తెలుపుతున్నా. దీనికి అదనంగా లీటర్ డీజిల్ లేదా పెట్రోల్ మీద వ్యాట్ రూ.7 తగ్గిస్తున్నాం. దీంతో లీటర్ డీజిల్ ధర రూ.17, లీటర్ పెట్రోల్ ధర రూ.12 తగ్గుతుంది అని గోవా సీఎం ప్రమోద్ సావంత్ ట్వీట్ చేశారు.
మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ సైతం పెట్రోల్, డీజిల్లపై రూ.7 వ్యాట్ తక్షణం తగ్గిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ రూ.7 తగ్గిస్తున్నట్లు త్రిపుర సీఎం బిప్లబ్ దేవ్ కుమార్ ట్వీట్ చేశారు.
దీంతో శుక్రవారం త్రిపురలో లీటర్ డీజిల్ రూ.17, లీటర్ పెట్రోల్ రూ.12 తగ్గుతుంది. రాష్ట్రంలోని 37 లక్షల మంది ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపరు.
కర్ణాటక సీఎం బస్వరాజ్ సీఎం కూడా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై వ్యాట్ తగ్గిస్తున్నట్లు పేర్కొంటూ వరుస ట్వీట్లు చేశారు. లీటర్ డీజిల్/ పెట్రోల్ మీద రూ.7 వ్యాట్ తగ్గిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ల మీద వ్యాట్ తగ్గించాలని నిర్ణయించినట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ కార్యాలయం ప్రకటించింది.
ఇక బీహార్లో నితీశ్ కుమార్ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి సర్కార్ పెట్రోల్ మీద లీటర్కు రూ.130, లీటర్ డీజిల్ పై రూ.1.90 వ్యాట్ తగ్గిస్తున్నట్లు తెలిపింది.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.2 వ్యాట్ తగ్గిస్తున్నట్లు గురువారం వెల్లడించింది.
ఒడిశాలో లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ మీద వ్యాట్ రూ.3 తగ్గనున్నది. ఇది శుక్రవారం అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నది.
ఇక ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కూడా వ్యాట్ తగ్గించివేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తగ్గింపుతో పెట్రోల్ లేదా డీజిల్ మీద లీటర్కు రూ.12 భారం తగ్గనున్నది.
సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్లపై వ్యాట్ రూ.7 తగ్గించివేసింది. దీంతో సిక్కింలో లీటర్ పెట్రోల్పై రూ.12, లీటర్ డీజిల్ మీద రూ.17 తగ్గిపోనున్నది.