న్యూఢిల్లీ, జూలై 22: కేజ్రీవాల్ సర్కారుపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా సంచలన ఆరోపణలు చేశారు. ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) సర్కారు ప్రవేశపెట్టిన నూతన ఎక్సైజ్ పాలసీ 2021-22 నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదంటూ సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేశారు. మద్యం పాలసీలో నియమాల ఉల్లంఘనలతో పాటు విధానపరమైన లోపాలపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు. వీటితోపాటు టెండర్ల తర్వాత లైసెన్స్దారులకు ప్రయోజనం చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగానే సర్కారు విధానపరమైన లోపాలకు పాల్పడినట్టు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పాత్రనూ వెలికితీయాలని సూచించారు.
జైలుకు వెళ్లేందుకు భయపడబోం: కేజ్రీవాల్
తాజా వివాదంపై సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించేలా కేంద్రప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేస్తున్నదని మండిపడ్డారు. అయినప్పటికీ, వాళ్లకు (బీజేపీకి) తలొగ్గే ప్రసక్తేలేదని చెప్పారు. సిసోడియాను కేంద్రం లక్ష్యంగా చేసుకున్నదని ఆరోపించారు. సిసోడియా తనకు 22 ఏండ్లుగా తెలుసునని, ఆయన నిజాయితీపరుడని చెప్పారు. ‘సిసోడియాను జైలుకు పంపుతారని నాకు తెలుసు. ప్రస్తుతం దేశంలో ఈ తరహా రాజకీయ ప్రతీకార చర్యలే కొనసాగుతున్నాయి. అయితే,ఇలాంటి తప్పుడు కేసులు కోర్టుల్లో నిలబడలేవని గమనించాలి. సిసోడియా మళ్లీ విడుదలై వస్తారని గుర్తించాలి’ అని పేర్కొన్నారు. ‘బీజేపీ నేతలు జైలుకు వెళ్లడానికి భయపడుతారు. ఎందుకంటే వాళ్లు సావర్కర్ వారసులు. మేము జైలుకు వెళ్లడానికి భయపడబోము. ఎందుకంటే మేం భగత్సింగ్ బిడ్డలం’ అని ఘాటుగా స్పందించారు.
నూతన పాలసీలో ఏమున్నది?
గత నవంబర్ 17న కేజ్రీ సర్కారు నూతన మద్యం విధానం 2021-22ను తీసుకొచ్చింది. దీని ద్వారా నగరంలోని 32 జోన్లలో 849 మంది ప్రైవేట్ బిడ్డర్లకు లైసెన్సులు జారీచేసింది. మద్యం సేవించేవారి వయసును 25 నుంచి 21 ఏండ్లకు తగ్గించడం, విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం, షాపుల సంఖ్య పెంచడం, లిక్కర్ దుకాణాల నిర్వహణ వేళల పొడగింపు వంటివి కొత్త పాలసీలో పేర్కొన్నారు. వీటిపై బీజేపీ, ఇతర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.