ముంబై: మహారాష్ట్ర (Maharashtra)లో అరుదైన సంఘటన తెరపైకి వచ్చింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో 51 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి 200 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు లభించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ తిరుగుబాటుతో ఇది సాధ్యమైంది. ఆదివారం డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ ప్రభుత్వంలో భాగమయ్యారు. దీంతో ప్రభుత్వంలో ఉన్న శివసేన షిండే వర్గం, బీజేపీ, ఎన్సీపీ రెబల్ వర్గం, ఇతర పార్టీలతో కలుపుకుని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 200 దాటింది.
కాగా, 1972లో తొలిసారి మహారాష్ట్ర ప్రభుత్వంలో 200 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, మొత్తం 222 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి చెందిన వారే. అప్పుడు అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 270. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం స్థానాల సంఖ్య 288. ప్రస్తుతం బీజేపీకి 105 మంది సభ్యులున్నారు. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 40 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య 145.
మరోవైపు షిండే-బీజేపీ ప్రభుత్వంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా భాగంగా ఉన్నారు. బహుజన్ వికాస్ అఘాడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ప్రహార్ జనశక్తి పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, రాష్ట్రీయ సమాజ్ పార్టీకి చెందిన ఒక సభ్యుడు, జన్ సురాజ్య శక్తి ఎమ్మెల్యే, 13 మంది స్వతంత్రులు కలిపి 20 మంది సభ్యుల మద్దతు ఉంది. వీరితో కలిపి మొత్తం 165 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు.
కాగా, తాజాగా ఎన్సీపీకి చెందిన మొత్తం 53 మంది ఎమ్మెల్యేల్లో అజిత్ పవార్ వర్గానికి చెందిన 36 మంది షిండే-బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే సంఖ్య 201కు చేరిందని మహారాష్ట్ర అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. అయితే సుమారు ఏడెనిమిది పార్టీలకు చెందిన 200 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్న షిండే-బీజేపీ ప్రభుత్వం ఎంత కాలం మనుగడలో ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.