భోపాల్: పదేళ్ల కిందట చనిపోయిన మహిళా టీచర్ కుటుంబానికి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నుంచి నోటీసులు (Tax Notice) అందాయి. 2017-18లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆమె రూ.7.55 కోట్ల పన్నులు చెల్లించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. ఈ నోటీస్ చూసి ఆ మహిళా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. పాట్ఖేడా గ్రామానికి చెందని ఉషా సోనీ కుటుంబానికి జూలై 26న ఐటీ శాఖ నుంచి నోటీసు అందింది. ఆమె రూ.7.55 కోట్ల మేర పన్నులు చెల్లించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. అయితే ఐటీ నోటీసులు చూసి ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.
కాగా, ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేసిన తన తల్లి అనారోగ్యం వల్ల 2013 నంబర్ 16న మరణించిందని ఆమె కుమారుడు తెలిపాడు. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను నోటీసులు అందాయని చెప్పాడు. స్క్రాప్ మెటీరియల్స్ కొని అమ్మే ‘నేచురల్ కాస్టింగ్’ కంపెనీ పేరు ఆ నోటీసులో ఉందన్నాడు. ఈ నేపథ్యంలో మరణించిన తన తల్లి పాన్ కార్డ్ నంబర్ను ఎవరో దుర్వినియోగం చేసినట్టు తాము గ్రహించామని తెలిపాడు. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించాడు.
మరోవైపు ఐరన్ రాడ్లు అమ్మే షాపులో పని చేసే నితిన్ జైన్ అనే వ్యక్తికి కూడా ఐటీ నోటీసులు అందాయి. నెలకు సుమారు రూ.7,000 సంపాదించే అతడు ఏకంగా రూ.1.26 కోట్ల మేర పన్నులు చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది చూసి అతడు కంగుతిన్నాడు. తమిళనాడులో తన పేరు మీద బ్యాంకు ఖాతా ఉన్నట్టుగా అందులో ఉన్నదని, దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పాడు.
కాగా, గిరిజనులు అధికంగా ఉండే బేతుల్ జిల్లాలో సుమారు 44 మందికి కూడా ఐటీ శాఖ నుంచి ఇలాంటి నోటీసులు అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమారు కోటి నుంచి పది కోట్ల వరకు పన్నులు చెల్లించాలని ఆ నోటీసుల్లో ఉన్నాయన్నారు. మరోవైపు ట్యాక్స్ నోటీసులు అందుకున్న పలువురు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.