Advance Booking | న్యూఢిల్లీ, అక్టోబర్ 17: రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ను 120 రోజుల నుంచి 60 రోజులకు కుదిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. నవంబరు 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని గురువారం ప్రకటించింది. అంటే, 60 రోజుల లోపు ప్రయాణానికే రైలు టికెట్ను ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్టోబరు 31 వరకు చేసుకున్న అన్ని బుకింగ్లు 120 రోజుల వరకు కొనసాగుతాయని రైల్వే స్పష్టతనిచ్చింది.
కాగా, గతంలో రైల్వే టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులే ఉండేది. 2015 మార్చి 25న దీనిని 120 రోజులకు పెంచారు. 120 రోజుల అడ్వాన్స్ బుకింగ్ వల్ల క్యాన్సలేషన్లు ఎక్కువ అవుతున్నాయని, ప్రయాణాలు రద్దు చేసుకోవడం వల్ల బెర్త్లు వృథా అవుతున్నాయని రైల్వే బోర్డు తెలిపింది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్లో 21 శాతం రద్దు అవుతున్నాయని, 4-5 శాతం మంది ప్రయాణికులు ప్రయాణాలు చేసుకుంటున్నప్పటికీ టికెట్లు క్యాన్సల్ చేసుకోవడం లేదని పేర్కొన్నది.
అసలైన ప్రయాణికులకు టికెట్లు లభించే అవకాశాలను పెంచేందుకు గడువును తగ్గించినట్టు తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్కు తక్కువ కాల పరిమితి ఉండే తాజ్ ఎక్స్ప్రెస్, గోమతి ఎక్స్ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్లో మార్పు లేదని రైల్వే బోర్డు పేర్కొన్నది. విదేశీయులు 365 రోజుల ముందు రైలు టికెట్లు బుక్ చేసుకునే విధానంలోనూ మార్పు లేదని తెలిపింది.