Aditya Thackeray | మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్యా థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయన్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని కోరారు. అకోలా జిల్లాలోని బాలాపూర్లో శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం కార్యకర్తల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆదిత్యా థాక్రే ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కలకలం సృష్టించింది. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయని గత వారం మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కూడా చెప్పారు.
‘రానున్న కొన్ని నెలల్లోనే ఈ ద్రోహుల ప్రభుత్వం కూలిపోతుంది. మహారాష్ట్రకు మధ్యంతర ఎన్నికలు వస్తాయి. ముందస్తు ఎన్నికలను ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి’ అని ఆదిత్యా థాక్రే సూచించారు. ఏక్నాథ్-ఫడ్నవిస్ల మధ్య ఎవరు ముఖ్యమంత్రో తెలుసుకోవడం ప్రజలకు కష్టం ఉన్నదన్నారు. మహారాష్ట్రలో రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులు, యువత సమస్యలను వినడానికి ఎవరూ లేరని ఆయన విచారం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయినందున కరవు ప్రాంతాలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.