ముంబై : ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ శివసేన నేత ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివ సంవాద్ యాత్రలో ఆదిత్య ఠాక్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి అనారోగ్యతో ఉన్న సమయంలో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. ఆయనకు ద్రోహం చేశారన్నారు.
గత శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో శివసేన మంత్రులకు నిధులు రాలేదని బుమ్రే చేసిన వాదనను ఆదిత్య ఠాక్రే కొట్టిపారేశారు. మరఠ్వాడా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కింద పైథాన్ ప్రాంతానికి మొదటి పథకం వచ్చిందన్నారు. బుమ్రేకు ఐదుసార్లు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారని చెప్పారు. గత పదిహేను రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని, చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, అయితే ప్రభుత్వాన్ని కేవలం ఇద్దరు వ్యక్తులు (ఏక్నాథ్ షిండే – దేవేంద్ర ఫడ్నవీస్) నడుపుతున్నారని విమర్శించారు. శివసేనను చీల్చిన 40 మంది రెబల్ ఎమ్మెల్యేలను ‘ద్రోహులు’గా పేర్కొన్నారు.