న్యూఢిల్లీ : రాష్ట్రపత్ని వ్యాఖ్యలతో కలకలం రేపిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి తన వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చారు. తాను పొరపాటున నోరు జారానని, చిన్న అంశాన్ని కాషాయ పార్టీ రాద్ధాంతం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే కుయుక్తితోనే బీజేపీ దిగజారి వ్యవహరిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం కాగానే తాను నోరు జారానని వివరణ ఇచ్చానని గుర్తుచేశారు. రాష్ట్రపతిని అవమానించాలనే దురుద్దేశం తనకు ఎంతమాత్రం లేదని అన్నారు. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని కించపరచాలని తాను అనుకోనని చెప్పారు. పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో బీజేపీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరానని, తన వ్యాఖ్యలపై నేరుగా ద్రౌపది ముర్ముకు వివరణ ఇచ్చేందుకు తాను సిద్ధమయ్యానని తెలిపారు. ఈ భేటీలో తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తానని చెప్పారు. ధరల పెరుగుదల, అగ్నిపథ్ వంటి ఎన్నో అంశాలపై చర్చను దాటవేస్తున్న బీజేపీ చవకబారు రాజకీయ ఎత్తుగడలతో తన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.