న్యూఢిల్లీ, జూన్ 28: గల్వాన్ లోయలో గతేడాది జరిగిన ఘర్షణలతో భారత్-చైనా మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. సరిహద్దుల్లో పూర్వస్థితిని నెలకొల్పేందుకు ఇరు దేశాలకు చెందిన ఆర్మీ ఉన్నతాధికారుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు లేనప్పటికీ, అదనుచూసి డ్రాగన్ దొంగదెబ్బ తీసే ప్రమాదం లేకపోలేదు. ఈ క్రమంలో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దుల్లోని మూడు కీలక ప్రాంతాలకు దాదాపు 50 వేల మంది అదనపు బలగాలను, యుద్ధ విమానాలను తరలించింది. ఇలా ప్రస్తుతం సరిహద్దుల్లో భారత్ తరుఫున 2 లక్షల మంది సైనికులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 40 శాతం ఎక్కువ. ఈ మేరకు బ్లూమ్బర్గ్ ఒక నివేదికలో వెల్లడించింది. చైనా నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడే వారిని నిరోధించే విధులను గతంలో సైన్యం చేపట్టేదని, అయితే, గతేడాది చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దురాక్రమణ కుతంత్రాన్ని చూశాక.. ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉన్నదని అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు చైనా కూడా సరిహద్దుల్లో భారీఎత్తున సైన్యాన్ని, దీర్ఘ శ్రేణి ఫిరంగులు, యుద్ధ ట్యాంకులు, రెండు ఇంజిన్లతో నడిచే యుద్ధ విమానాలను మోహరించింది. టిబెట్ సమీపంలో యుద్ధ విమానాలకు రక్షణగా బుల్లెట్ ఫ్రూఫ్ బంకర్లు, రన్వే బిల్డింగులు, ఎయిర్ ఫీల్డ్లను ఏర్పాటు చేసింది. కాగా, గత జూన్లో తూర్పు లఢక్లోని గల్వాన్లో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే.
రెచ్చిపోతే ఊరుకోం
రక్షణ మంత్రి రాజ్నాథ్
పొరుగుదేశాలతో భారత్ ఎప్పుడూ స్నేహపూర్వకంగానే మసులుకుంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ పునరుద్ఘాటించారు. అయితే, ఘర్షణలకు దిగే వారికి సరైన బుద్ధి చెబుతామని చైనాను పరోక్షంగా హెచ్చరించారు. గల్వాన్ ఘర్షణల్లో గతేడాది అమరులైన జవాన్ల త్యాగాలను ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. ఈ మేరకు లఢక్ పర్యటనలో సోమవారం మాట్లాడారు. జమ్ముకశ్మీర్, లఢక్ను యూటీలుగా మార్చడంతో సరిహద్దుల్లో భద్రత బలోపేతమైందని, చొరబాట్లు తగ్గాయని అన్నారు. మరోవైపు, ఆరు రాష్ర్టాలు, రెండు యూటీల్లో నిర్మించిన 63 బ్రిడ్జ్లను ప్రారంభించిన రాజ్నాథ్ వాటిని జాతికి అంకితమిచ్చారు. వీటిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) నిర్మించింది.