ముంబై: ముంబైలోని ప్రఖ్యాత ధారావి స్లమ్ రీడవలప్మెంట్ ప్రాజెక్టు బిడ్డింగ్ నిబంధనల్ని మార్చి ఇప్పటికే ప్రధాని సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీకి అప్పగించిన బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా మొత్తం ముంబై రియాల్టీనే అదానీ పాదాక్రాంతం చేసింది. ఇందుకోసం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్టుకు (డీఆర్పీ) సంబంధించిన డెవలప్మెంట్ కంట్రోల్ రూల్స్లో కొన్నింటిని హఠాత్తుగా మారుస్తూ నోటిఫికేషన్ జారీచేసింది.
కొత్త రూల్స్తో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి అదానీ గ్రూప్ ఇబ్బడిముబ్బడిగా నిధుల్ని ఇతర ముంబై రియల్టీ డెవలపర్ల నుంచి సునాయాసంగా సమకూర్చుకుంటుంది. అంతేకాకుండా భారీ పన్ను ప్రయోజనాలు కలిగేలా ఇండెక్సేషన్ లేకుండానే ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్లు) ఉపయోగించుకునే అవకాశాన్ని సైతం అదానీ గ్రూప్ అందుకుంది.
40 శాతం టీడీఆర్లను అదానీ నుంచే కొనాలి
ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్టు ప్రతిపాదిత వ్యయం రూ. 23,000 కోట్లు. ఈ ప్రాజెక్టును బిడ్డింగ్లో గెలుచుకున్న అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్దే 80 శాతం మెజారిటీ వాటా. డీఆర్పీని రూ. 5,069 కోట్లకు బిడ్డింగ్లో పొందిన అదానీ గ్రూప్ తొలుత రూ. 1,000 కోట్ల వరకూ పెట్టుబడి చేసింది. తన గ్రూప్ కంపెనీల్లో కొంత వాటాను విక్రయించి, మిగిలిన మొత్తాన్ని ఇచ్చే పనిలో ఉంది.
ఇక ప్రాజెక్టు పూర్తి చేయడానికి భారీ పెట్టుబడులు అవసరం అవుతాయి. అదానీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా నోటిఫికేషన్ ప్రకారం ముంబైలోని రియల్టీ డెవలపర్లు వారికి అవసరమైన టీడీఆర్ల్లో తొలి 40 శాతం రైట్స్ను ధారావి ప్రాజెక్టు నుంచే తప్పనిసరిగా కొనాలి. అంటే స్లమ్ ప్రాజెక్టు నుంచి తీసుకున్న టీడీఆర్ను అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో కూడా వాడుకుని, అదనపు స్పేస్లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు.
ప్లాట్ విలువలో 90 శాతం ధరతో టీడీఆర్ అమ్ముకోవచ్చు
అదానీకి అడ్డగోలు ప్రయోజనం కల్పించే మరో నిబంధన ప్రకారం ధారావి టీడీఆర్ను ప్లాట్ విలువలో 90 శాతం వరకూ ధరను నిర్ణయించి అమ్ముకునే వీలు కలుగుతుంది. సాధారణంగా టీడీఆర్లు డెవలప్మెంట్ ప్లాట్ ధరలో 30-60 శాతం మేర ఉంటాయి. ముంబైలో ఎక్కడా లేనంతగా 90 శాతం ధరకు విక్రయించే అనుమతినివ్వడంతో ధారావి టీడీఆర్ అత్యంత ఖరీదైనదని రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు చెపుతున్నారు.
అదానీ నుంచి ఎంత కొంటే అంత..
టీడీఆర్లు ఆశ చూపించి అదానీ చుట్టూ తిరిగే పరిస్థితికి ముంబై బిల్డర్లను తాజా నిబంధనలు తీసుకొచ్చాయి. వాస్తవానికి ఒక చౌక ప్రాజెక్టు నుంచి 1,000 చదరపు అడుగుల టీడీఆర్ను కొంటే ఖరీదైన ప్రాంతాల్లో కేవలం 100 చదరపు అడుగుల అదనపు నిర్మాణానికే అనుమతిస్తారు. కానీ సవరించిన నిబంధనల ప్రకారం ధారావి టీడీఆర్ను ఎంత స్పేస్కు తీసుకుంటే అంతే స్పేస్ను దక్షిణ ముంబైలాంటి పోష్ ఏరియాల్లో వాడుకునే అవకాశాన్ని కల్పించారు.