Hindenburg | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): తమను, తమ ప్రభుత్వాన్ని, తమ సన్నిహితులను విమర్శించిన లేదా ప్రశ్నించిన వారిపై దాడులు లేదా వేధింపులకు పాల్పడటం కేంద్రంలోని బీజేపీకి నిత్యకృత్యంగా మారింది. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై డాక్యుమెంటరీని ప్రసారం చేసిన బీబీసీ స్థానిక కార్యాలయాలపై ఇటీవల ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించడం తెలిసిందే. హిండెన్బర్గ్ ఉదంతంలో కూడా ఇప్పుడు అదే జరుగుతున్నది.
అదానీ గ్రూప్ కంపెనీలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాయంటూ జనవరిలో అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికతో ఆ గ్రూప్ కంపెనీలు దాదాపు రూ.12 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను కోల్పోవాల్సి వచ్చింది. విపక్షాల డిమాండ్తో ఎట్టకేలకు ఈ ఉదంతంపై దర్యాప్తునకు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) రంగంలోకి దిగింది. అయితే, రోజులు గడుస్తున్నా.. ఎలాంటి కీలక సమాచారాన్ని అధికారులు ఇంకా రాబట్టలేదు సరికదా.. ఇప్పుడు అవకతవకల సమాచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన హిండెన్బర్గ్ కంపెనీపై దృష్టి సారించారు. భారత్లోని షార్ట్ సెల్లింగ్ నిబంధనలు, ఎఫ్పీఐ మార్గదర్శకాలను, ఇన్సైడర్ ట్రేడింగ్, ఆఫ్షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్ (పీ-నోట్) తదితర నిబంధనలను హిండెన్బర్గ్ అతిక్రమించిందా? అన్న కోణంలో సెబీ దర్యాప్తునకు సిద్ధమైనట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఉల్లంఘనలకు పాల్పడి సామాన్యుల సొమ్మును కర్పూరంలా కరిగించేసిన అదానీ కంపెనీలను వదిలేసి, అక్రమాలను బయటపెట్టిన హిండెన్బర్గ్ కంపెనీని సెబీ లక్ష్యంగా చేసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. ప్రశ్నించిన వారిపై కక్షసాధింపులకు దిగడం బీజేపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శిస్తున్నారు.
అదానీ అక్రమాల దర్యాప్తులో సెబీ వ్యవహరిస్తున్న తీరుపై తొలి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఈ ఏడాది జనవరి ఆఖర్లో రూ.20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే హిండెన్బర్గ్ నివేదిక, తదనంతర పరిణామాల మధ్య ఫిబ్రవరి ఒకటిన ఎఫ్పీవోను అనూహ్యంగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎఫ్పీవోలో పాల్గొన్న సబ్స్ర్కైబర్ల వివరాలు, ఎఫ్పీవో రద్దుకు కారణం ఏమిటని ఓ ఆర్టీఐ పిటిషన్ దాఖలైంది. అదానీ ఎఫ్పీవో గురించి తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదంటూ సెబీ చేతులు దులుపుకున్నది. హిండెన్బర్గ్ రిపోర్టుపై దర్యాప్తు జరుగుతున్నదా? అవకతవకల సమాచారమేంటి? అన్న మరో ప్రశ్నకు సెబీ సమాధానమిస్తూ.. దరఖాస్తుదారుడు అడిగిన ప్రశ్న ‘సమాచారం’గా పరిగణించబడదంటూ దాటవేత ధోరణి ప్రదర్శించింది. అంతేకాకుండా, అదానీ ఉదంతాన్ని దర్యాప్తు చేయడానికి మరో ఆరు మాసాల గడువు కావాలంటూ అత్యున్నత న్యాయస్థానానికి సెబీ ఇటీవల విన్నవించుకోవడం అదానీ అంశం పట్ల ఆ సంస్థ ఉదాసీనతకు తార్కాణం.