Coal Shortage | న్యూఢిల్లీ, నవంబర్ 28: దేశంలోని పలు థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో నెలకొన్న బొగ్గు కొరత, విదేశాల నుంచి బొగ్గు దిగుమతులపై ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈ మేరకు ఏఐపీఈఎఫ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. డిస్కమ్లు, వినియోగదారులపై భారం వేయకుండా, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు దిగుమతి చేసుకొనే బొగ్గు అదనపు ధరను కేంద్రమే భరించాలని పేర్కొన్నది. బొగ్గు దిగుమతులను పెంచడం ద్వారా పలు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూరుతున్నదని, అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర విపరీతంగా పెరుగుతున్నదని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు చట్టం-2003 కింద అసాధారణ అధికారాలను ఉపయోగించి దిగుమతి బొగ్గును తప్పనిసరిగా కొనుగోలు చేసి వినియోగించాలంటూ ఆదేశాలు ఇవ్వడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నది.
ప్రధానంగా లబ్ధి పొందిందెవరు?
బొగ్గు దిగుమతుల వల్ల ప్రధాన లబ్ధిదారులు ఎవరనేది ‘టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ ది ఎంక్వైరీ’లో చేర్చాలని ఏఐపీఈఎఫ్ చైర్మన్ శైలేంద్ర దూబే పేర్కొన్నారు. దిగుమతి బొగ్గు ఆధారంగా పనిచేసే విద్యుత్తు ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం, అదేవిధంగా దేశీయ బొగ్గు ఆధారిత ప్లాంట్లు దిగుమతి బొగ్గు మిశ్రమాన్ని 4 నుంచి 6 శాతానికి పెంచాలని సూచనలు చేయడం వల్ల బొగ్గు దిగుమతులు భారీగా పెరిగాయని ఏఐపీఈఎఫ్ పేర్కొన్నది.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో విద్యుత్తు చట్టంలోని సెక్షన్ 11 కింద ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన విద్యుత్తు డిమాండ్, దేశంలో సరిడా బొగ్గు సరఫరా లేని కారణంగా దిగుమతి బొగ్గు ఆధారిత ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని అందులో పేర్కొన్నది. మొదట ఈ ఆదేశాలను ఈ ఏడాది మార్చి 16 నుంచి జూన్ 15 వరకు అమలు చేయగా, తర్వాత 2024, జూన్ వరకు పొడిగించారు.
అదానీదే సింహభాగం
విదేశాల నుంచి భారత్కు అత్యధికంగా బొగ్గు ఎగుమతి చేస్తున్న కంపెనీ అదానీ గ్రూప్దే. దేశంలో అత్యధికంగా థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న కంపెనీ, బొగ్గును సరఫరా చేసే ప్రైవేట్ రైల్వే ర్యాక్స్ వ్యవస్థ కూడా అదానీదే. దేశంలోని కీలకమైన బొగ్గు గనులే కాదు.. ఆస్ట్రేలియా, ఇండోనేషియా తదితర దేశాల్లోనూ అదానీ గ్రూప్నకు పెద్ద ఎత్తున బొగ్గు గనులున్నాయి. థర్మల్ విద్యుత్తు సంస్థలన్నీ తాము వాడే బొగ్గులో కనీసం 6 శాతం విదేశీ బొగ్గు కలుపాలని ఆదేశించటం, ఆయా కంపెనీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని కేంద్రం పేర్కొనడం.. అదానీ గ్రూప్నకు అనుచిత లబ్ధి చేకూర్చడానికేననే విమర్శలు ఉన్నాయి.