జైపూర్: సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రోజు నిరాహార దీక్ష చేసిన సచిన్ పైలట్(Sachin Pilot) పై చర్యలు తీసుకుంటామని రాజస్థాన్ కాంగ్రెస్ తెలిపింది. గత బీజేపీ ప్రభుత్వ అవినీతి కేసులపై సీఎం అశోక్ గెహ్లాట్ చర్యలు చేపట్టకపోవడానికి నిరసనగా సచిన్ పైలట్ నిరాహార దీక్ష చేయడాన్ని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ సింగ్ రంధావా తప్పుపట్టారు. ‘సచిన్ పైలట్ లేవనెత్తిన అవినీతి సమస్యతో నేను ఏకీభవిస్తున్నా. కానీ దానిని లేవనెత్తిన విధానం సరైనది కాదు. అసెంబ్లీ సమావేశాల్లోనే ఆయన దానిని లేవనెత్తాల్సి ఉంది’ అని అన్నారు. సీఎం అశోక్ గెహ్లాట్పై మరోసారి బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేసిన సచిన్ పైలట్తో బుధవారం గంటన్నర పాటు మాట్లాడినట్లు ఆయన తెలిపారు. గురువారం కూడా ఆయనతో చర్చిస్తానని చెప్పారు. ‘నేను అన్ని విషయాలను విశ్లేషించి, తప్పు ఎవరిది అన్న దానిపై నివేదికను సిద్ధం చేస్తా. గతంలోనే చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అది జరుగలేదు. కానీ ఈసారి చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
కాగా, రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ సింగ్ రంధావా ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను బుధవారం కలిశారు. మంగళవారం జైపూర్లో సచిన్ పైలట్ చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్ష గురించి ఆయనతో చర్చించారు. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఏ కార్యక్రమమైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమమే అని దీక్షకు ముందు పైలట్ను ఆయన హెచ్చరించారు. అయినా పైలట్ లెక్కచేయకపోవడంతో ఈసారి ఆయనపై చర్యలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
Also Read: