లక్నో: చనిపోయిన వృద్ధురాలి బంధువులు దారుణానికి పాల్పడ్డారు. ఆస్తిని కాజేసేందుకు ఆమె బొటనవేలితో నకిలీ వీలునామాపై ముద్రలు వేయించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. 2021 మే 8న కమలా దేవి అనే వృద్ధురాలు చనిపోయింది. అయితే బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తూ మార్గమధ్యలో కారు నిలిపారు. ఒక న్యాయవాది సమక్షంలో నకిలీ వీలునామా సృష్టించేందుకు ప్రయత్నించారు. మరణించిన వృద్ధురాలి బొటనవేలితో నకిలీ వీలునామాపై ముద్రలు వేయించారు. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయినట్లు కుటుంబానికి తెలిపారు.
కాగా, వృద్ధురాలు కమలా దేవి ఆస్తిని కాజేసేందుకు బంధువులు నకిలీ వీలునామా సృష్టించినట్లు ఆమె మనవడు జితేంద్ర శర్మ ఆరోపించాడు. తన తల్లి మేనత్త కమలా దేవి అని తెలిపాడు. ఆమె భర్త చాలా ఏళ్ల కిందట చనిపోయినట్లు చెప్పాడు. వారికి పిల్లలు లేరని దీంతో ఆమె సోదరుడి కుమారులు ఆస్తిని కాజేసేందుకు నకిలీ వీలునామా సృష్టించారని విమర్శించాడు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పి మార్గమధ్యలో కారు నిలిపి చనిపోయిన ఆమె చేతి బొటనవేలితో నకిలీ వీలునామాపై ముద్రలు వేయించారని ఆరోపించాడు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ క్లిప్లో ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు, కమలా దేవి ఎప్పుడూ కూడా సంతకం మాత్రమే చేస్తుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే నకిలీ వీలునామాపై చేతివేలి ముద్రలు ఉండటంతో తమకు అనుమానం కలిగిందని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని, ఇది తమ దృష్టికి రావడంతో నకిలీ వీలునామా సంగతి తెలిసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Thumb impression of a dead woman taken forcibly on legal papers by a known family in Agra. Looks like it's an advocate getting it done. Act caught on camera!
Video via @sudhirkmr6931 pic.twitter.com/UdBqcMBf1l
— Judge Sahab❣️ (@lawWalaLadka) April 11, 2023