బవారియా (జర్మనీ) : కంచు లోహంతో తయారు చేసిన మూడు వేల ఏండ్ల నాటి అరుదైన ఖడ్గాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు జర్మనీలో కనుగొన్నారు. ఈ కత్తి పాడవ్వకుండా ఇంకా తళతళా మెరుస్తూ కన్పించి ఆశ్చర్యపరిచింది. కత్తిని భద్రపరిచిన విధానంలో తీసుకున్న జాగ్రత్తల వల్లే అది తుప్పు పట్టకుండా ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. పురావస్తు పరిరక్షణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..
బవారియన్లోని నార్డ్లింజెన్ పట్టణంలోని సమాధులను తవ్వగా ఈనెల 14న మూడు వేల ఏండ్ల నాటి ఖడ్గం బయటపడింది. దీని అష్టభుజీ పట్టీ సహా ఖడ్గమంతా కంచు లోహంతోనే చేశారని, దీనిని భద్రపర్చడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో అది పాడవ్వకుండా ఇంకా మెరుస్తూనే ఉందని, బహుశా ఇది అష్టభుజి రకం ఖడ్గంగా భావిస్తున్నట్టు వారు చెప్పారు.