కారులో వెళ్తూ.. రోడ్డు దాటుతున్న ఆవును తప్పించడానికి ప్రయత్నించి దుర్మరణం పాలయ్యాడో ఎంపీ కుమారుడు. తమిళనాడులోని కీఝపుతుపట్టులో ఈ ఘటన జరిగింది. రాజ్యసభ ఎంపీ, అడ్వొకేట్ ఎన్ ఆర్ ఎలాంగో కుమారుడు రాకేష్ రంగనాథన్ (21) ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
స్నేహితుడితో కలిసి గురువారం ఉదయం పుదుచ్చేరికి బయలుదేరిన రాకేష్.. కీఝపుతుపట్టు గ్రామం మీదుగా వెళ్తున్నాడు. బాగా వేగంగా ఆ కారు వస్తుండగా ఒక ఆవు సడెన్గా రోడ్డు దాటబోయింది. దాన్ని తప్పించడానికి ప్రయత్నించిన రాకేష్ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టిందని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. అతనితోపాటు ఉన్న ఫ్రెండ్ కె వేదా వికాష్ (21) తీవ్రమైన గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఇద్దరినీ కూడా దగ్గరలో ఉన్న పుదుచ్చేరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీఐఎమ్ఎస్)లో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.