బెంగళూరు: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవినీతి అధికారులపై కర్ణాటక ప్రభుత్వం కొరఢా ఝులిపించింది. అక్రమాస్తులు కలిగిఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది ప్రభుత్వ అధికారుల ఇండ్లపై అవినీతి నిరోధక శాఖ (ACB) దాడులు నిర్వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 80 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నది. ఈ దాడుల్లో మూడు వందల మంది అధికారులు పాల్గొన్నారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం రాకపోవడంతో కాంగ్రెస్, మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే కూటమిలో చీలిక రావడంతో ఏడాది కాలంలోనే ఆ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం యెడియూరప్ప సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే అవినీతి ఆరోపణలు రావడంతో బీజేపీ అధినాయకత్వం ఆయనను పదవినుంచి తొలగించి బస్వరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేసిన విషయం తెలిసిందే.