బెంగళూర్ : లైంగిక దాడి ఆరోపణలపై ప్రముఖ లింగాయత్ మఠం సన్యాసి శివమూర్తి మురుగ శరనరును కర్నాటకలో పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. చిత్రదుర్గలోని ప్రముఖ మురుగ మఠాధిపతి శివమూర్తిని హవేరి జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. మఠం నిర్వహించే సంస్ధలో చదువుతున్న బాలికలను లైంగిక వేధింపులకు గురిచేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. మైనర్ బాలికల తరపున ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శివమూర్తి మురుగపై మైసూర్ సిటీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఆయనపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మఠం నిర్వహిస్తున్న స్కూల్లో చదువుతన్న ఇద్దరు బాలికలను మైసూరుకు చెందిన ఎన్జీఓ ఒదనాది సేవా సంస్ధ కాపాడి ఆపై మఠాధిపతి నిర్వాకంపై ఇల్లా బాలల సంక్షేమ కమిటీకి ఫిర్యాదు చేసింది. మురుగ మఠానికి చెందిన హాస్టల్లో ఉంటున్న 15, 16 పంవత్సరాల ఇద్దరు బాలికలను శివానంద మురుగ మూడున్నర ఏండ్లుగా లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా వారు భయంతో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.
ఇదే సంస్ధలో చదువుతున్న మరికొందరు విద్యార్ధినులను శివమూర్తి లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణలున్నాయని ఎన్జీఓ అధిపతి స్టాన్లీ తెలిపారు. తమకు ఎలాంటి బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గబోమని, బాలల హక్కలు కాపాడటం సమాజంలోని అందరి బాధ్యతని చెప్పారు.