అబుదాబి: యూఏఈ-భారత్ మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అబుదాబిలోని జలేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మంగళవారం జరిగిన అహ్లాన్ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘మీరంతా యూఏఈలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. భారత్లోని వివిధ రాష్ర్టాల నుంచి ఇక్కడికి వచ్చినా మీ అందరి హృదయాలు అనుసంధానమై ఉన్నాయని’ మోదీ పేర్కొన్నారు. ఇక్కడి ప్రతి ఒక్కరి గుండె చప్పుడు యూఏఈ-భారత్ దోస్తీ జిందాబాద్ అని నినదిస్తున్నదని చెప్పారు. యూఏఈ ప్రభుత్వం తనను అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ జాయెద్తో సత్కరించినట్టు ప్రధాని తెలిపారు.
నేడు బీఏపీఎస్ ఆలయం ప్రారంభం
అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయం బోచా సన్యాసి శ్రీ అక్షర పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ (బీఏపీఎస్) మందిర్ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించనున్నారు. 27 ఎకరాలలోని ఈ ఆలయ నిర్మాణం 2019లో ప్రారంభమైంది. దీనికి కావాల్సిన స్థలాన్ని యూఏఈ ప్రభుత్వమే సమకూర్చింది. అబుదాబిలో బీఏపీఎస్ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించినందుకు అధ్యక్షునికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.