బేగంపేట మే 21: ఉపాధి కరువై ఆర్థిక పరిస్థితి బాగాలేక రోడ్డున పడ్డ దంపతులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో బేగంపేట పోలీసులు ఉద్యోగాలు కల్పించారు. బేగంపేట బస్తీలో డోకుల కృష్ణారావు, సరిత దంపతులు కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. కృష్ణారావు స్కూల్బస్సు డ్రైవర్గా పనిచేసేవాడు. ప్రస్తుతం పాఠశాలలు మూతపడటంతో ఉద్యోగం పోయింది. ఐదు నెలలుగా ఇంటి కిరాయి కూడా చెల్లించకపోవడంతో యజమాని ఈ నెల 13న ఖాళీ చేయించారు. చేతిలో చిల్లిగవ్వలేని వీరు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని చిలకలగూడ చౌరస్తా కల్వర్టు దగ్గర తలదాచుకుంటున్నారు. ఆ రోడ్డుపై వెళ్తున్న యువకుడు ఇమ్రాన్ వీరి పరిస్థితిని తెలుసుకొని గాంధీనగర్ పరిధిలోని ఫతేదార్భవన్లో వసతి కల్పించాడు. వీరి దీనగాథపై వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్చేసి, మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో ట్యాగ్చేశాడు. మంత్రి కేటీఆర్ స్పందించి, వారిని చేరదీయాలంటూ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఉత్తర మండల డీసీపీకి ఆదేశాలు జారీచేశారు. బేగంపేట పోలీసులు పాత ఎయిర్పోర్ట్ పక్కనే జరుగుతున్న కార్గో కన్స్ట్రక్షన్లో కృష్ణారావుకు డ్రైవర్గా రూ.16 వేల వేతనంతో, అతని భార్య సరితకు రూ.10 వేల వేతనంతో స్వీపర్గా ఉద్యోగం ఇప్పించారు. రెండు పూటలా భోజనం, వసతిని కంపెనీ ఏర్పాటుచేసింది.