న్యూఢిల్లీ, జనవరి 10: ఉత్తరప్రదేశ్లో బీజేపీ హవా తగ్గింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 312 సీట్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన ఆ పార్టీపై ప్రజల నమ్మకం సన్నగిల్లింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 100 సీట్ల దాకా కోల్పోతుందని ఏబీపీ సీఓటర్ సర్వే వెల్లడించింది. యూపీ అసెంబ్లీలో బీజేపీ అధికారం నిలబెట్టుకొన్నప్పటికీ 223 సీట్లే వస్తాయని సర్వేలో తేలింది. ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్లోనూ బీజేపీ సీట్లు గణనీయంగా తగ్గిపోనున్నాయి. 2017తో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీకి 20 సీట్లు తక్కువగా వస్తాయని సర్వే తెలిపింది. అయితే, ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటా పోటీ ఉన్నది. కానీ, సీఎంగా ఎవరైతే బాగుంటుందన్న విషయంలో మాత్రం మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ నేత హరీశ్ రావత్కే ఓటేస్తున్నారు.
మణిపూర్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరా హోరీ ఉన్నది. ఇక అందరూ ఆసక్తిగా చూస్తున్న పంజాబ్లో ఈ సారి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారం చేజిక్కించుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2017లో పంజాబ్లో 20 సీట్లు సాధించిన ఆప్ ఈ సారి 58 సీట్ల దాకా సాధిస్తుందని సర్వే పేర్కొన్నది. గత ఎన్నికల్లో 77 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 40 స్థానాలకే పరిమితం కానున్నది. మాజీ సీఎం అమరిందర్ కొత్త పార్టీ ప్రభావేమీ లేదని, బీజేపీ కూడా గతంలోలాగే పంజాబ్లో 3 సీట్లకే పరిమితం అవుతుందని సర్వే తెలిపింది. గోవాలో అధికారాన్ని మళ్లీ బీజేపీనే దక్కించుకొంటుందని సర్వే వెల్లడించింది.
సీఎం ఎవరు కావాలి?
ఎవరు సీఎం అయితే బాగుంటుందని ఐదు రాష్ర్టాల ప్రజలను అడిగారు. పంజాబ్లో ఆప్కు ఓటేస్తామని ఎక్కువమంది చెప్పగా.. సీఎంగా మాత్రం కాంగ్రెస్ నేత, ప్రస్తుత సీఎం చన్నీకి 28.8% మంది ఓటేశారు. ఆప్ నేత భగవంత్ మన్ 23.3% ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ అభ్యర్థి హరీశ్ రావత్ సీఎం కావాలని 37.3% మంది కోరుకొన్నారు. ప్రస్తుత సీఎం ధామీ వైపు 28.6% మంది మాత్రమే మొగ్గు చూపారు.