న్యూఢిల్లీ: రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు నరేంద్ర మోదీ పాలనలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్నాయని దాదాపు 50 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనకు తొమ్మిదేండ్లు పూర్తయిన సందర్భంగా సీఓటర్ సంస్థ నిర్వహించిన ప్రత్యేక పాన్ ఇండియా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2014 ఎన్నికల సమయంలో అవినీతికి వ్యతిరేకంగా సంపూర్ణంగా యుద్ధం చేస్తానన్నది మోదీ ప్రధానంగా ప్రచారం చేశారు.
అందులో భాగంగానే సీబీఐ, ఈడీ రెండూ చాలా దూకుడు ప్రదర్శించి అవినీతితో సంపాదించిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. అయితే మోదీ పాలన ముఖ్యంగా తనకు రాజకీయంగా, ఎన్నికలలో సవాలుగా నిలిచే ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే సాగిందన్న విమర్శలున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నట్టు ప్రతిపక్షాలు నిరంతరం ఆరోపిస్తూ వస్తున్నాయి. సీ ఓటర్ సర్వేలో ప్రతిపక్షాల ఆరోపణలను సమర్థిస్తూ సుమారు 50 శాతం మంది భారతీయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం 35 శాతం మంది ఈ ఆరోపణను వ్యతిరేకించారు.
యుపీఏ మద్దతుదారుల్లో 60 శాతం మంది కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని అభిప్రాయపడగా.. ఎన్డీఏ మద్దతుదారుల్లో కూడా 30 శాతం మంది అదే విషయం చెప్పారు. వివిధ ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులు అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలపై గత తొమ్మిదేండ్లలో విచారణలు, దాడులు, అరెస్టులు ఎదుర్కొన్నారు. కొంత మంది జైళ్లకు కూడా వెళ్లారు. ప్రధాని మోదీ బలవంతుడు అనే భావనకు భిన్నంగా దాదాపు మెజారిటీ భారతీయులు ఆయన పాలన వీధిశక్తులకు లొంగిపోయిందని అభిప్రాయపడినట్టు సీ ఓటర్ సర్వేలో తేలింది. మోదీ ఎన్నో వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వ్యవసాయ చట్టాల గురించి అడిగిన ప్రశ్నకు 47 శాతం మంది మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.