పాట్నా: బీహార్లోని కీలకమైన బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం అభిషేక్ కుమార్ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దీంతో ఇదే ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న ‘జన్ సురాజ్ పార్టీ’ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నాయకురాలు రేఖా గుప్తా, అభిషేక్ కుమార్ మధ్య త్రిముఖ పోటీకి రంగం సిద్ధమైంది. (Bankipur Bypoll) బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన అభిషేక్ కుమార్, బంకీపూర్ ప్రాంతంలో బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. దాదాపు 26 ఏళ్లుగా పార్టీతో, దాని యువజన విభాగంతో ఆయన అనుబంధం కలిగి ఉన్నారు.
కాగా, బంకీపూర్ నియోజకవర్గంలో బలమైన ప్రాతినిధ్యం ఉన్న కాయస్థ సామాజిక వర్గానికి చెందిన అభిషేక్ కుమార్ క్షేత్రస్థాయి కార్యకర్తగా బీజేపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కాలక్రమేణా ఆ పార్టీలో అనేక సంస్థాగత పదవులు చేపట్టారు. మండల కార్యదర్శి, మండల ప్రధాన కార్యదర్శి, మండల అధ్యక్షుడు, పాట్నా మెట్రోపాలిటన్ బీజేవైఎం అధ్యక్షుడు, బీజేవైఎం బీహార్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంటి పదవుల్లో ఆయన రాణించారు.
మరోవైపు బంకీపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన నిబిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో బీజేపీకి కంచుకోటగా పరిగణించే ఖాళీ అయిన ఈ నియోజక వర్గంలో జూలై 30న ఉప ఎన్నిక జరుగనున్నది. మధ్యప్రదేశ్, గుజరాత్లో మరో రెండు స్థానాలకు అదే రోజున పోలింగ్ నిర్వహించనున్నారు. ఆగస్ట్ 3న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.