న్యూఢిల్లీ : పంజాబ్ సీఎం అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీని ప్రకటించడం పట్ల ఆప్ స్పందించింది. ఇసుక దొంగను సీఎం అభ్యర్ధిగా కాంగ్రెస్ ఎంపిక చేసిందని ఆదివారం ఆప్ ఎద్దేవా చేసింది. అక్రమ ఇసుక మైనింగ్ నిందితుడిని సీఎం అభ్యర్ధిగా ఎంపిక చేయడం మూడు కోట్ల మంది పంజాబీలకు అవమానకరమని ఆప్ రాష్ట్ర కో-ఇన్చార్జ్ రాఘవ్ చద్దా అన్నారు. మూడు కోట్ల మంది పంజాబీల్లో ఇసుక దొంగ తప్ప సరైన సీఎం అభ్యర్ధి కాంగ్రెస్కు లభించలేదని ఆరోపించారు. ఇసుక దొంగను సీఎం అభ్యర్ధిగా ప్రకటించిన కాంగ్రెస్కు అభినందనలని ఆప్ మీమ్స్ను ప్రచారంలోకి తెచ్చింది. చన్నీని పార్టీ సీఎం అభ్యర్ధిగా లుధియానాలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో చంకూర్ సాహిబ్ స్ధానంతో పాటు బదౌర్ స్ధానాల్లో పోటీ చేస్తున్నారు. తనపై విశ్వాసం ఉంచిన పంజాబీలతో పాటు కాంగ్రెస్ హైకమాండ్కు చన్నీ కృతజ్ఞతలు తెలిపారు.
పంజాబ్ను అన్ని రంగాల్లో ప్రగతిపధంలో నడిపేందుకు శక్తివంచన లేకుండా ముందుకు సాగుతానని పేర్కొన్నారు. తన వద్ద డబ్బు లేదని, అయితే ఎన్నికల్లో ధైర్యంతో పోరాడతానని, పంజాబ్ ప్రజలు ఈ యుద్ధంలో పోరాడతారని వ్యాఖ్యానించారు. కాగా అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లుథియానాకు చేరుకోగానే పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యులతో ఓ గదిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎం చెన్నీ, పీసీసీ చీఫ్ సిద్దూ, సీనియర్ నేత సునీల్ జాఖడ్తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక్కడే రాహుల్ వీరందరికీ చెన్నీయే సీఎం అభ్యర్థి అని చెప్పినట్లు సమాచారం.
అటు సిద్దూను, ఇటు సునీల్ జాఖడ్ను రాహుల్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాతే సిద్దూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థి ఎవరైనా తాను కలిసే పనిచేస్తానని, రాహుల్ గాంధీ మాట జవదాటనని సిద్దూ సభలో ప్రకటించారు. ఇక ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. చన్నీ నేతృత్వంలో మరోసారి పాలనా పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పంజాబ్లో సత్తా చాటేందుకు కసరత్తు సాగిస్తోంది. మరోవైపు బీజేపీ-కెప్టెన్ సింగ్ సారధ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్లు ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇస్తుండగా అకాలీదళ్ సైతం సత్తా చాటేందుకు సన్నద్ధమైంది.