న్యూఢిల్లీ : ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తరహా పాలనను పంజాబ్ కోరుకుంటోందని, ఆ రాష్ట్రంలో ఆప్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా అన్నారు. పంజాబ్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని సరైన సమయంలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, అకాలీదళ్ వంటి సంప్రదాయ పార్టీలతో పంజాబీలు విసిగిపోయారని, ఆప్నకు ఒక అవకాశం ఇవ్వాలని వారు కోరుకుంటున్నారని అన్నారు.
పంజాబ్లో తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు ప్రధాన పార్టీల పట్ల అసంతృప్తితో ఉన్నట్టు కనిపించిందని ఆప్, అరవింద్ కేజ్రీవాల్కు ఓ అవకాశం ఇవ్వాలనే సెంటిమెంట్ నెలకొందని చెప్పారు. ఆప్ పంజాబ్ ఎన్నికల్లో ఈసారి నిర్ధిష్టంగా పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆప్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పూర్తిచేసిన పనులు పంజాబ్ ప్రజలకు తెలుసన్నారు.