Arvind Kejriwal | న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో అ‘సామాన్యుడు’ అరవింద్ కేజ్రీవాల్. ఐఆర్ఎస్ అధికారిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి.. అన్నాహజారేతో కలిసి అవినీతిపై పోరాటం సాగించి.. ఆమ్ఆద్మీపార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి.. రాజకీయాల్లోకి వచ్చీ రాగానే ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యారు కేజ్రీవాల్. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటూ క్రమంగా తన పార్టీని ఇతర రాష్ర్టాలకు విస్తరింప చేశారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి తొలిదశ పోలింగ్కు నోటిఫికేషన్ వెలువడిన తరుణంలో కేజ్రీవాల్ అరెస్ట్ కావటం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
సుమారు పదేండ్లుగా దేశంలో ఎదురులేని ప్రధాని నరేంద్రమోదీకి కేజ్రీవాల్ కొరకరాని కొయ్యగా మారారు. ఎక్కడైనా ఓకే కానీ.. ఢిల్లీలో మాత్రం కాదంటూ మోదీకి సవాల్ విసిరి రెండు పర్యాయాలు ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్నారు. తాను స్థాపించిన ఆప్ని క్రమంగా విస్తరిస్తూ పోతున్నారు. ఢిల్లీ తర్వాత పొరుగున ఉన్న పంజాబ్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. గోవాలో కూడా ఆప్ పోటీ చేసినా విజయం అందుకోలేకపోయింది. సమీప భవిష్యత్తులో ఆప్ నుంచే ముప్పు తప్పదన్న భయాన్ని బీజేపీలో కలిగించారు కేజ్రీవాల్. ఇదంతా ఒక్క రోజులోనో, ఏడాదిలోనో సాధ్యమైనది కాదు.. దీని వెనుక అతని దార్శనికత, పట్టుదల, అకుంఠిత దీక్ష, దక్షత, రాజనీతిజ్ఞత దాగున్నాయి.
హర్యానాలోని ఓ కుగ్రామంలో పుట్టిన కేజ్రీవాల్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన ఖరగ్పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. కొంత కాలం టాటాస్టీల్స్ పనిచేసిన ఆయన.. 1993లో సివిల్స్లో నెగ్గి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో చేరారు. అక్కడ తన తోటి ఐఆర్ఎస్ అధికారిణి సునీతను పెళ్లాడారు. నకిలీ రేషన్ కార్డుల కుంభకోణాన్ని బయటపెట్టేందుకు 1999లో పరివర్తన్ ఉద్యమాన్ని చేపట్టడంతో తొలిసారి ఆయన వెలుగులోకి వచ్చారు. ఆదాయ పన్ను, విద్యుత్తు, ఆహార, రేషన్ పదార్థాల అంశాల పట్ల ఢిల్లీ ప్రజల పక్షాన కేజ్రీవాల్ పోరాడారు. ఈ క్రమంలో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరిన్ని సామాజిక సమస్యలపై పోరాటానికి సిద్దమయ్యారు. 2006లో పబ్లిక్ కాజ్ రిసెర్చ్ ఫౌండేషన్ స్థాపించారు.
2010లో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో కలిసి జన్లోక్పాల్ బిల్లు ఆమోదం కోసం పోరాడారు. ఈ ఉద్యమంతో కేజ్రీవాల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో రాజకీయ జోక్యాన్ని అన్నా హజారే నిరసించారు. ఇదే అంశంపై అన్నా హజారేతో కేజ్రీవాల్ విభేదించారు. దేశ ప్రజాస్వామ్యం, అవినీతి అంశాలపై తన ఆలోచనలు, అభిప్రాయాలను తెలియచేస్తూ స్వరాజ్ అనే పుస్తకాన్ని రాశాడు కేజ్రీవాల్. ఆ తర్వాతే 2012, నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేసింది. తొలి ప్రయత్నంలోనే 70 సీట్లకు గాను 28 సీట్లను గెల్చుకున్నది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ షరతులతో కూడిన మద్దతునివ్వటంతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొలిసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే జన్లోక్పాల్ బిల్లు ఆమోదంలో వైఫల్యం చెందటంతో 49 రోజులకే సీఎం పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో అప్పట్లో రాష్ట్రపతి పాలన విధించారు.
16వ లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీచేశారు కేజ్రీవాల్. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ క్లీన్ స్వీప్ చేసింది. 70 స్థానాలకు గాను 67 గెల్చుకుంది. తిరుగులేని మెజార్టీతో కేజ్రీవాల్ ఢిల్లీకి 7వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఆయన పార్టీ 62 సీట్లను కైవసం చేసుకున్నది.
తన హయాంలో ఢిల్లీ ప్రజలకు చేసిన సేవలు కేజ్రీవాల్ను తిరుగులేని నేతగా నిలబెట్టాయి. సర్కారీ స్కూళ్లను, దవాఖానలను ఆయన కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది దేశానికే ఆదర్శంగా నిలిపారు. దీనికితోడు మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను కేజ్రీవాల్ విమర్శిస్తూ వచ్చారు. కేంద్రానికి వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన సుదీర్ఘ దీక్షకు పరోక్షంగా కేజ్రీవాల్ మద్దతునిస్తున్నాడని మోదీ సర్కారు అనుమానిస్తున్నది.
అందరు రాజకీయ నాయకుల్లాగా కాకుండా కేజ్రీవాల్ చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన పూర్తిగా శాఖాహారి, రాజకీయాలు మినహాయిస్తే ఆయన బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్కు అభిమాని, కామెడీ మూవీస్ను బాగా ఇష్టపడతారు. తన డెస్క్ను తానే స్వయంగా శుభ్రం చేసుకుంటారు. నౌకర్ల అవసరం లేకుండా తన పనులను తానే చేసుకుంటారు. మొత్తానికి తనదైన రాజకీయ శైలితో, వ్యక్తిగత క్రమశిక్షణతో ప్రజలకు సేవ చేయాలన్న తపనతో దేశ రాజకీయాల్లో విలక్షణ నేతగా, అనితర సాధ్యుడిగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచాడన్నది జనాభిప్రాయం.