న్యూఢిల్లీ : తీహార్ జైల్లో మనీష్ సిసోడియాను చంపేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందా అని ఆప్ ప్రశ్నించింది. తీహార్ జైలులోని ఒకటో నెంబర్ సెల్లో కరుడుగట్టిన నేరస్తులను నిర్బంధిస్తారని, ఇదే సెల్లో మనీష్ సిసోడియాను కూడా వేయడంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంను మట్టుబెట్టేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందా అని ఆప్ నేత, ఆ పార్టీ ప్రతినిధి సౌరవ్ భరద్వాజ్ కాషాయ పార్టీని ప్రశ్నించారు.
బీజేపీ కుట్రలో భాగంగానే మనీష్ సిసోడియాను తీహార్ జైలు సెల్ నెంబర్ వన్లో ఉంచారని ఆయన బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. మానసిక అలజడితో బాధపడే నేరగాళ్లు ఆ సెల్లో ఉంటారని, ఒక్క సంకేతంతో వారు ఎవరినైనా చంపేస్తారని అన్నారు. ఢిల్లీలో ఆప్ను ఓడించలేని బీజేపీ, ఇలాంటి పద్ధతుల్లో ప్రత్యర్ధులను అంతమొందిస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు.
ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లోనూ బీజేపీ పరాజయం పాలైందని, ఆ ఓటమిని ప్రధాని మోదీ ఇలా తీర్చుకుంటారా అని భరద్వాజ్ నిలదీశారు. ప్రధాని మౌనం వీడాలని, రాజకీయంగా ఓడించలేని తమను బీజేపీ జైలుకు పంపుతోందని, తమ నేతలను చంపేందుకే కాషాయ పార్టీ ఇలా చేస్తోందా అని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 26న అరెస్ట్ చేసింది.