న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (AAP MP Sanjay singh) అన్నారు. అయినా మోదీ (PM Modi) ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ (BJP) ఇచ్చిన మాట తప్పిందని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు (Women’s Reservation Bill) అమలు చేయాలనే డిమాండ్తో భారత జాగృతి (Bharat Jagruthi) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారు. దీక్షకు హాజరై ఎమ్మెల్సీ కవిత పోరాటానికి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పోరాటం ఇవాళ్టిది కాదని, దశాబ్దాలుగా ఈ నినాదాలు వినీవినీ చెవులు చిల్లులు పడుతున్నాయని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిళ్లు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు తప్పు మీదంటే మీదని అనుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీజేపీ ప్రభుత్వం ఒకే వ్యక్తి కోసం పనిచేస్తున్నదని.. అతనే అదానీ అని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆకాశం నుంచి పాతాళం వరకు అన్నీ అదానీ పేరుమీదే రాసిస్తున్నారని విమర్శించారు. అదేమని అడిగితే ఈడీలను, సీబీఐలను ప్రయోగిస్తున్నారని చెప్పారు. ఈడీలు, సీబీఐలు తమను ఏం చేయలేవని స్పష్టం చేశారు. తామెవరికీ భయపడే రకం కాదని వెల్లడించారు. దేశంలో రైతులు దుఖ పడుతున్నారని, మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. దేశంలోని పేదలకు సాయం చేయడానికి మోదీకి చేతులు రావని చెప్పారు. బీజేపీ కండువా కప్పుకుంటే చాలు తప్పులన్నీ మాఫీ అయిపోతాయని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో ఉన్నవాళ్లంతా సత్యహరిశ్చంద్రులా అని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ నాటకాలు ఇప్పటికైనా బంద్ పెట్టాలని హితవు పలికారు.